క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్లో రెండు మసీదుల్లో జరిగిన కాల్పుల్లో మొత్తం 40 మంది మృతి చెందారని ఆ దేశ ప్రధాని జెసిండా ఆర్డెన్ ప్రకటించారు. కాల్పుల్లో లిన్వుడ్ వద్ద పది మంది, డీన్ ఏవ్ మసీదు వద్ద మరో 30 మంది మృతి చెందగా, మరో 27 మంది గాయపడ్డారు. ‘ఇదో అసాధారణ కాల్పుల ఘటన. ఉగ్రవాద చర్య . పక్కా ప్రణాళికతోనే కాల్పులకు తెగబడ్డార’ని ఆక్రోశించారు.
దుండగుడు ఆస్ట్రేలియా పౌరుడు
ఆస్ట్రేలియా పౌరుడే వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డారని ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. అతివాద భావజాలంతో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడన్నారు. ఈ కేసులో మొత్తం నలుగుర్ని అరెస్టు చేశారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. వారి వివరాలను వెల్లడించేందుకు నిరాకరించారు. లైవ్స్ట్రీమ్ చేసిన దుండగుడు పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా అన్నదానిపై స్పష్టత రాలేదు.
దాడి కోసమే న్యూజిలాండ్కు
దాడికి ముందు దుండగుడు తన సోషల్మీడియా ఖాతాల్లో తాను కాల్పులు జరుపబోతున్నట్లు పలు పోస్టులు చేసినట్లు సమాచారం. అందుకు గల కారణాలను మొత్తం 74 పేజీల ప్రణాళికలో దుండగుడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. దాడి చేసేందుకు తగిన శిక్షణ తీసుకునేందుకే తాను న్యూజిలాండ్కు వచ్చినట్లు కూడా అందులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఖాతాలను సామాజిక మాధ్యమ సంస్థలు సస్పెండ్ చేశాయి. లైవ్స్ట్రీమ్ వీడియోను కూడా ఫేస్బుక్ తొలగించింది.