
ఇటానగర్:అరుణా చల్ ప్రదేశ్ హయులి యాంగ్ విధాన సభ నియోజకవర్గం పరిధిలోని మలోగామ్ పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 11న జరగనున్న ఎన్నికకు పది మంది సిబ్బంది నియమితులయ్యారు. ఆ పోలింగు కేంద్రంలో సొకెలా తయాంగ్ (39) అనే మహిళ ఒక్కరే ఓటు వేయనున్నారు. గ్రామస్తుల పేర్లన్నీ వేరే పోలింగు కేంద్రంలో ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ సొకెలా ఆమె భర్త జెనెలాం తయాంగ్ ఓట్లు మాత్రమే ఉండేవి.ఇటీవల జెనెలాం తన ఓటుకు మరో కేంద్రానికి మార్చుకున్నాడు. హయులియాంగ్ నుంచి మలోగామ్ పోలింగు కేంద్రానికి అక్కడికి వెళ్లడానికి కాలినడకన ఒక రోజు పడుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు.అక్కడికి మోటారు వాహనాలు వెళ్లేందుకు రహదారి సదుపాయం లేదు. ‘‘ఓటరు ఒక్కరే ఉన్నా ప్రిసైడింగ్ అధికారి, ఇతర అధికారులు, భద్రతా సిబ్బంది తదితర పది మందికి పైగా అక్కడ ఉండాలి. సొకెలా ఎప్పుడొచ్చి ఓటు వేస్తుందో తెలియదు. కాబట్టి పొద్దుట 7 నుంచి సాయంత్రం 5 వరకు ఆమె కోసం ఎదురు చూడాల్సిందే. ‘ఒక్కరే కదా అని ఫలానా టైముకి వచ్చి ఓటె య్యమని చెప్పే అధికారం మాకు లేదు’ అని ఎన్నికల అధికారి లికెన్ కొయు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8.94 లక్షల ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన 2,022 పోలింగు కేంద్రా ల్లో ఏడింటిలో పది మంది కంటే తక్కువ ఓటర్లు ఉన్నారు. లంటా పోలింగు కేంద్రంలో ఆరుగురే ఓటర్లు ఉన్నారు. 281 కేంద్రాల్లో వందలోపు ఓటర్లు ఉన్నారు. శివారుల్లో ఉన్న 518 పోలింగ్ కేంద్రాలకు మూడు రోజుల పాటు నడిచే వెళ్లాలి.