వరుస విజయాలతో దూసుకుపోతూ అంతరిక్ష పరిశోధన రంగంలో భారత పతాకాన్ని రెపరెపలాడించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 25న పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. దీని ద్వారా కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ నెల 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ-47 నింగికెగియనుంది.కార్టోశాట్-3ని 509 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ఇస్రో ప్రవేశపెట్టనుంది. హై రెజొల్యూషన్ ఇమేజింగ్ క్యాపబిలిటీ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. మరోవైపు, ఇతర 13 నానో శాటిలైట్లు అమెరికాకు చెందినవి కావడం గమనార్హం.కొద్ది రోజుల క్రితం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలం కావడంతో పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్ ప్రయోగంపై సర్వత్రా ఉత్కంఠ,ఆసక్తి నెలకొంది..