సికింద్రాబాద్: అల్వాల్ చినరాయుని చెరువులో అక్రమంగా చేపట్టిన మూడు భవన నిర్మాణాలను హైడ్రా సిబ్బంది గురు వారం కూల్చివేశారు. నిర్మాణదారులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. చినరాయుని చెరువుకు చెందిన ఎఫ్టీఎల్ పరిధిలో కొందరు వ్యక్తులు అక్రమంగా భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని స్థానికులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అక్రమ నిర్మాణాలను గుర్తించారు. గురువారం ఉదయం హైడ్రా సిబ్బంది భారీ బందోబస్తు నడుమ చినరాయుని చెరువు చేరుకుని, అక్రమంగా నిర్మిస్తున్న మూడు నిర్మాణాలను యంత్రాల సహాయంతో నేలమట్టం చేశారు.