ఐక్యరాజ్య సమితి : ఆఫ్ఘన్లో ఆకలి కేకలు తప్పవని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్స్కి చెందిన ఆఫ్ఘన్ డైరెక్టర్ మేరి ఎలన్ మాట్లాడారు. ‘ఇప్పటికే కరోనా దెబ్బతో కుదేలైపోయిన ఆఫ్ఘన్లో తాజాగా నెలకొన్న మానవీయ సంక్షోభంతో ప్రజలపై తీవ్రమైన ఆర్థిక, సామాజిక ప్రభావం కనిపిస్తుంది. దేశంలో 40 శాతానికి పైగా పంటలు సరిగా పండలేదు. నిల్వ ఉన్న ఆహార ధాన్యాలు నాశనమయ్యాయి. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకొనైనా… ఈ ఆకలి సంక్షోభాన్ని నివారించాలంటే, 20 కోట్ల అమెరికా డాలర్లు తక్షణం అవసరం. ఆఫ్ఘన్ తాలిబన్ల చేజిక్కిన వేళ.. తలెత్తిన సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదు. తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్లోని వేలాదిమంది నిరాశ్రయులు అవుతున్నారు. వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కూడా కష్టంగానే ఉంది. గత మే నెలలో 40 లక్షల మంది ఆకలిని తీర్చాం. వచ్చే కొద్ది నెలల్లో 90 లక్షల మంది కడుపు నింపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా సవాళ్లు ఎదురవుతున్నాయ’ని వివరించారు.