ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి
పాదయాత్ర ఇతివృత్తంతో మళయాళం మెగాస్టార్ మమ్ముట్టి ప్రధానపాత్రలో నటించిన యాత్ర చిత్రం
చెప్పుకోదగినస్థాయిలో వసూళ్లు రాబడుతూ విజయాన్ని సొంతం చేసుకుంది.విడుదలైన మూడు రోజుల్లోనే
చిత్రం బడ్జెట్లో సగానికిపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.వసూళ్లు ఇదే విధంగా కొనసాగితే
మొదటి వారంలో చిత్రం లాభాల్లోకి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.తెలుగు
రాష్ట్రాలతో పాటు విదేశాల్లో,మమ్ముట్టి రాష్ట్రమైన కేరళలో కూడా యాత్ర చిత్రం మంచి వసూళ్లు
సాధిస్తున్నట్లు తెలుస్తోంది.వసూళ్లు భారీగా వస్తున్న నేపథ్యంలో మరో వైపు డిజిటల్ రైట్స్ శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ చిత్రం భారీ ఎత్తున బిజినెస్ చేస్తోంది. ఈమద్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు అమెజాన్ ప్రైమ్ భారీ రేటును పెట్టి కొనుగోలు చేస్తుంది. చిన్న చిత్రాలను కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. కాని ‘యాత్ర’ సినిమాను మాత్రం స్టార్ హీరోల సినిమాను మించి రేటు పెట్టి కొనుగోలు చేసింది. యాత్ర సినిమాకు అమెజాన్ ప్రైమ్ రూ.8 కోట్లకు అటు ఇటుగా పెట్టినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.అమెజాన్ రైట్స్ ద్వారానే బడ్జెట్ లో సగానికి అటు ఇటుగా రాబట్టిన యాత్ర ఇక శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ ద్వారా మరింతగా దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కేవలం అమెజాన్ రైట్స్ శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ తోనే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి యాత్ర సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. వైఎస్ ఆర్ ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాడనేందుకు ఈ సినిమా సక్సెస్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.