ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో కూలిన షెడ్డు.. దంపతుల తలకు గాయాలు

ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో కూలిన షెడ్డు.. దంపతుల తలకు గాయాలు

న్యూ ఢిల్లీ: ఇక్కడి  ఫైవ్ స్టార్ హోటల్లో షెడ్డు కూలి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకున్నట్లు ఆర్కేపురం పోలీసులు తాజాగా వెల్లడించారు. పంజాబ్లోని లూథియానాకు చెందిన 42 ఏళ్ల అమిత్ జైన్, ఆయన భార్య 32 ఏళ్ల రీవా జైన్ చండీగఢ్లో వ్యాపారం నిర్వహిస్తుంటారు. వీరు వ్యాపార పనుల నిమిత్తం తరచూ ఢిల్లీకి వస్తుంటారు. నగరానికి వచ్చినప్పుడల్లా వారు నైరుతి ఢిల్లీలోని హోటల్ హయత్ రీజెన్సీ లో స్టే చేస్తుంటారు. ఇప్పుడు కూడా వారు హయత్ రీజెన్సీలోనే దిగారు. ఈ సందర్భంగా సోమవారం రాత్రి సమయంలో వారు హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అక్కడున్న షెడ్డు కొంత భాగం అకస్మాత్తుగా కూలి దంపతులపై పడింది. ఈ ఘటనలో వారు ప్రాణాలతో బయటపడ్డారు. తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై తమకు సోమవారం రాత్రి 8:56 గంటల సమయంలో ఫోన్ కాల్ వచ్చినట్లు ఆర్కే పురం పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అప్పటికే వారిని వసంత్ కుంజ్లోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ప్రథమ చికిత్స అనంతరం దంపతులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు చెప్పారు. ఘటనపై దంపతులు ఇంకా ఫిర్యాదు చేయలేదని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos