ఢిల్లీ : విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. పది జాతీయ సంస్థలను ఆంధ్రప్రదేశ్లో నిర్మించాలని చట్టంలో పేర్కొన్నారని, పదేళ్లలో వీటిని పూర్తి చేయాలని చట్టంలో పొందుపరిచారని చెప్పారు. వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ 2015-16లోనే ఏపీలో జాతీయ విద్యా సంస్ధలను ఏర్పాటు చేశామని, అదే ఏడాది ఐఐటీ తరగతులను ప్రారంభించామని తెలిపారు. ఉమ్మడి ఏపీలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదని, ఒక ప్రాంతానికే అభివృద్ధి పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కలే జాతీయ సంస్ధలు ఏర్పాటయ్యాయని అన్నారు. విభజన తర్వాత ఏపీకి అన్యాయం జరిగిందనే భావన అక్కడి ప్రజల్లో నెలకొందని చెప్పారు.