చెన్నై: గ్రిల్ చికెన్లో ‘లెగ్ పీస్’ లేకుండా వడ్డించిన ఓ హోటల్ యాజమాన్యానికి వినియోగదారుల ఫోరం రూ.10 వేల జరిమానా విధించింది. కేసు ఖర్చులకు మరో రూ.5వేలు కలిపి మొత్తం రూ.15వేలను వినియోగదారునికి చెల్లించాలని ఆదేశించింది. కోయంబత్తూరుకు చెందిన క్రిస్టోఫర్ ఎడిసన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న ఓ బిర్యానీ హోటల్కు గత జనవరి 14న కలిసి వెళ్లాడు. తందూరి చికెన్, గ్రిల్ చికెన్ ఆర్డరు చేశాడు. గ్రిల్ చికెన్లో లెగ్పీస్ లేకపోవడంతో హోటల్ సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే వారు అతడిని బెదిరించారు. కుటుంబ సభ్యుల ఎదుట జరిగిన ఈ బెదిరింపుతో తాను మానసిక క్షోభ అనుభవించానని అతడు ఫోరంలో ఆ వెంటనే ఫిర్యాదు చేశాడు. హోటల్ బిల్ రూ.1,196 అయిందని, ఆ మొత్తంతో పాటు తన మానసిక క్షోభకు నష్టపరిహారం ఇప్పించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఫోరం.. హోటల్ యాజమాన్యానికి రూ.10 వేల జరిమానా విధించింది. కేసు ఖర్చులకు మరో రూ.5 వేలు కలిపి మొత్తం రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించింది.