రాజమండ్రి:గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉంది. తెల్లవారుజామున అధికారులు రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాకపోకల జరగక కోనసీమ లంక గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తూ అధికారులు సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నట్లు హెడ్ వర్క్స్ ఈఈ జి. శ్రీనివాసరావు వెల్లడించారు. సాయంత్రానికి బ్యారేజీకి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశమున్నట్లు ఆయన తెలిపారు. అయినవిల్లి మండలం ఎదురుబీడెం కాజ్ వే నీటి మునిగింది. రాజోలు భీమవరం నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు కాజ్ వేల పైకి వరద నీరు చేరింది.ప్రస్తుతం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.10 అడుగుల నీటిమట్టం నమోదైంది. గోదావరి నదీపాయలు వశిష్ఠ, వైనతేయ, గౌతమి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పి. గన్నవరం మండలంలోని నాలుగు లంక గ్రామాల ప్రజలు మరపడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఉద్ధృతి దృష్ట్యా ఆయా గ్రామాల్లోని విద్యార్థులకు తహసీల్దార్ సెలవులు ప్రకటించారు. వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.