కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న సంక్షోభం ఇప్పట్లో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినా అధికారం వదులుకోవడం ఇష్టం లేని కుమరస్వామి ప్రతిరోజూ ఏదెఒక సాకుతో బలపరీక్షను వాయిదా వేయిస్తూ రోజులు వెళ్లదీస్తున్నారు.సభలో నేరుగా బలపరీక్ష ఎదుర్కోకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు,చరిత్ర,ఎమ్మెల్యేల రాజీనామాలకు కారణాలు ఇలా అనవసరమైన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతూ కాలక్షేపం చేస్తున్నారు కాంగ్రెస్-జేడీఎస్ నేతలు. సోమవారమే బలపరీక్ష నిర్వహించి తీరుతామంటూ స్పీకర్ రమేశ్కుమార్ ప్రకటించినా కాంగ్రెస్-జేడీఎస్ నేతలు మాత్రం అర్ధరాత్రి వరకు సభను సాగదీసి ఎట్టకేలకు మంగళవారానికి వాయిదే వేయించుకున్నారు. అయితే సభను వాయిదా వేసే సమయంలో మంగళవారం ఎట్టిపరిస్థితుల్లోనూ బలపరీక్ష నిర్వహిస్తామంటూ స్పీకర్ రమేశ్కుమార్ అల్టిమేటం జారీ చేశారు.అయితే ఈ అల్టీమేటం అంతగా ప్రభావం చూపుతుందని ఎవరూ భావించడం లేదు.మరోవైపు కొద్ది రోజులుగా ముంబైలో తిష్ట వేసిన రెబల్ ఎమ్మెల్యేలు మంగళవారం సభకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేయగా అందుకు తాము సిద్ధంగా లేమంటూ రెబల్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.ఇప్పట్లో ముంబై వదలి రాలేమని సమన్లపై స్పందించడానికి తమకు నాలుగు వారాల గడువు ఇవ్వాలని నాలుగు వారాల తరువాతే తాము సమన్లకు సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.నాలుగు వారాల గడువు కావాలని కోరుతూ కాంగ్రెస్ సభ్యులు రమేష్ జార్కిహోళి, మహేష్ కుమటహళ్లి, బైరాతి బసవరాజ్, బీసీ పాటిల్, ప్రతాప్గౌడ పాటిల్, శివరామ్ హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్, ఎంటీబీ నాగరాజ్,గోపాలయ్య, విశ్వనాథ్, నారాయణ గౌడ సంతకాలు చేసిన లేఖ స్పీకర్ రమేశ్కుమార్ పంపించారు. వారితో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్ శంకర్ కూడా వేరుగా స్పీకర్కు లేఖను రాశారు. అయితే సభకు హాజరు కావాలంటూ జారీ చేసిన సమన్లను ధిక్కరించిన నేపథ్యంలో రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేశ్కుమార్ ఎటువంటి చర్యలు తీసుకుంటారోనన్న ఉత్కంఠత నెలకొంది..