కరోనా వైరస్ నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్న ప్రపంచ దేశాలకు ప్రస్తుతం భారత్ ఆశాదీపంలా కనిపిస్తోంది.అందుకు కారణం భారత్లో ఉత్పత్తయ్యే హైడ్రాక్లీక్లోరోక్విన్ మాత్రలే.మలేరియాకు చికిత్సలో భాగంగా అందించే ఈ మాత్రలకు కరోనాను నిలువరించే శక్తి ఉందని కొన్ని పరిశోధనల్లో ప్రాథమికంగా తేలడంతో అగ్రరాజ్యమైన అమెరికా నుంచి నిరుపేద దేశాల వరకు భారత్ వైపు ఆశగా చూస్తున్నారు.ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు,బుజ్జగింపులతో ఈ మాత్రలను తన దేశానికి తెప్పించుకోగా బ్రెజిల్,శ్రీలంక,ఇజ్రాయిల్,బంగ్లాదేశ్ ఇలా అన్ని దేశాలు ఈ మాత్రలు తమ దేశాలకు తెప్పించుకున్నాయి.అయితే స్వీడన్,ఫ్రాన్స్ దేశాలు మాత్రం ఈ మాత్రలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాయి.అంతేకాదు కరోనాకు చికిత్సగా ఈ మాత్రలను వాడరాదని ఆయా దేశాల వైద్యులు సైతం నిర్ణయించుకున్నారు. ఇది ప్రధానంగా మలేరియా చికిత్సలో వాడతారని, దీన్ని కరోనా బాధితులపై ప్రయోగించడం ద్వారా దుష్పరిణామాలు సంభవించే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు. ఇది తీవ్రస్థాయిలో గుండెపోటుకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఓ కరోనా రోగికి హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడిన అనంతరం ఎలక్ట్రోకార్డియోగ్రామ్ పరీక్ష చేస్తే, ఆ రోగి హృదయస్పందనలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించాయని, అందుకే ఇకపై ఈ మందును కరోనా చికిత్సలో వాడబోమని అక్కడి డాక్టర్లు తేల్చి చెప్పారు.అటు, స్వీడన్ లోనూ పలు ఆసుపత్రులు క్లోరోక్విన్ వాడకం నిలిపివేశాయి. స్వీడన్ లోని స్టాక్ హోమ్ నగరానికి చెందిన కార్ల్ సైడెన్ హాగ్ అనే వ్యక్తికి కరోనా సోకగా, రోజుకు రెండు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలు వేసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే ఆ మాత్రలు వేసుకున్నప్పటి నుంచి సైడెన్ హాగ్ తీవ్రమైన తలనొప్పి, దృష్టి మందగించడం, కండరాలు పట్టేయడం వంటి సమస్యల బారినపడ్డాడు.ఈ నేపథ్యంలో వీటిని కరోనాపై చికిత్సకు వినియోగించరాదని నిర్ణయించుకున్నారు.