ముంబై : విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) ఇంటిదారి పట్టారు. భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వీలైనంత ఎక్కువగా వెనక్కి తీసేసుకుంటున్నారు. దేశీయంగా పెట్టుబడులు పెడుతున్న ఎఫ్ఐఐల్లో సుమారు 35 శాతం అమెరికాకు చెందినవారే. అగ్రరాజ్యాధినేత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల నేపథ్యంలో వీరి పెట్టుబడుల ఉపసంహరణలు ఇటీవలికాలంలో పెరిగాయి. జనవరిలో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి ఏకంగా రూ.78,000 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవడం గమనార్హం. గత నెల 23 రోజులు ట్రేడింగ్ జరిగితే 22 రోజులు ఎఫ్ఐఐలు అమ్మకాలకే పెద్దపీట వేశారు. ఫిబ్రవరిలోనూ ఇదే జరుగుతుండగా.. ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా తరలిపోయిన విదేశీ పెట్టుబడుల విలువ లక్ష కోట్ల రూపాయలపైనే ఉన్నట్టు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) ద్వారా అందుతున్న సమాచారం. ఈ నెలలో 10 రోజులపాటు ట్రేడింగ్ జరిగితే, 9 రోజులు పెట్టుబడుల ఉపసంహరణలే. ఈ క్రమంలోనే ఈ నెలలో ఇప్పటిదాకా రూ.27,856.34 కోట్లు వెనక్కిపోయినైట్టెంది.