ముంబై : మహారాష్ట్రలో గత మూడేళ్లలో 12 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఇక్కడ ప్రకటించింది. 2015 నుంచి 2018 వరకూ ఆ ఆత్మహత్యలు దాఖలైనట్లు మంత్రి సుభాష్ దేశ్ముఖ్ శాసన సభలో లిఖితపూర్వకంగా తెలిపారు. మొత్తం 12,021 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 6,888 మంది ప్రభుత్వం నుంచి పరిహారాన్ని పొందేందుకు అర్హులుగా ఆయా జిల్లాల అధికారులు గుర్తించారన్నారు. ఇప్పటి వరకు 6,845 రైతు కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.లక్ష వంతున ఆర్థిక సాయం చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో గత జనవరి నుంచి మార్చి వరకూ 610 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారిలో 192 మందిని సాయం పొందడానికి అర్హులుగా గుర్తించారు. 182 రైతు కుటుంబాలకు ఇప్పటికే పరిహారాన్ని అందించామని తెలిపారు. అంతేకాకుండా మిగిలిన రైతుల ఆత్మహత్యలపై కూడా పరిశీలన జరుగుతోందని తెలిపారు.