పదవుల పంపకంపై పాకులాట

పదవుల పంపకంపై పాకులాట

ముంబై: నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య పదవుల పంపకంపై పాకులాట మొదలైనట్లు తెలుస్తోంది. హోం, ఆర్థిక శాఖలు తన వద్దే ఉండాలని షిండే పట్టుబడుతుండగా, హోం శాఖ, నగరాభివృద్ధి, రెవెన్యూ, జలవనరులు లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తిరుగుబాటు, బీజేపీ ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ స్పీకర్గా రాహుల్ నార్వేకర్ను ఎన్నుకోవడంలో షిందే, ఫడ్నవీస్ వర్గానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. మంత్రివర్గంలో ఎవరికి స్ధానం కల్పిస్తారు..? ఆ తరువాత పదవులు ఎలా పంపకం చేస్తారు.? ఏ ఎమ్మెల్యేకు, ఏ పదవి కట్టబెడతారనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్, ఎన్సీపీ వద్ద ఉన్న పదవుల్లో అధిక శాతం పదవులు తమకే కావాలని బీజేపీ భావిస్తోంది. ఏక్నాథ్ షిండే వద్ద ముఖ్యమంత్రి పదవి ఉండటంతో హోం, విద్యుత్, నగరాభివృద్ధి, జలవనరుల లాంటి కీలక శాఖలు తమకే కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. షిండే వర్గం హోం, నగరాభివృద్ధి, ఆర్ధిక, జలవనరులు, విద్య లాంటి కీలక శాఖలు కావాలని కోరుకుంటుంది. అందులో హోం, ఆర్ధిక లాంటి అత్యంత కీలకమైన శాఖలు స్వయంగా తన వద్ద ఉంచుకోవాలని షిండే పట్టుబడగా, ఫడ్నవీస్ కూడా ఆ రెండు శాఖలు తనవద్దే ఉంచుకోవాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos