న్యూ ఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సంబంధించి జరుగుతున్న ఊహాగానాలపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండో విడతలో మీరు ముఖ్యమంత్రి అవుతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా, “దానికి కాలమే సమాధానం చెబుతుంది. నేను చెప్పను. ప్రపంచంలో ఎవరైనా ఆశతోనే జీవించాలి. ఆశ లేకపోతే జీవితమే లేదు” అని వ్యాఖ్యానించారు. ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2025 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం చేతుల్లోనే ఉంటుందని శివకుమార్ స్పష్టం చేశారు. “ఈ విషయం నాకు, నా పార్టీకి, సిద్ధరామయ్యకు సంబంధించింది. మాకు పార్టీ అధిష్ఠానమే సర్వస్వం. వారు ఏది నిర్దేశిస్తే దానికే కట్టుబడి ఉంటాం. వారి నిర్ణయాన్ని మేం శిరసావహిస్తాం” అని ఆయన తెలిపారు. తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సుపరిపాలన అందించడమేనని ఆయన అన్నారు.ప్రస్తుత ప్రభుత్వ బలానికి ఐక్యతే కారణమని శివకుమార్ నొక్కి చెప్పారు. “ఇది ఒక్కరి కృషి కాదు. నేను, సిద్ధరామయ్య లేదా మరెవరైనా కాదు. మేమందరం కలిసికట్టుగా అలుపెరగకుండా పనిచేశాం. ప్రజలకు మేం ఒక మాట ఇచ్చాం, వారు మమ్మల్ని నమ్మారు. ఈ ఐక్యతే మాకు గొప్ప బలాన్ని ఇచ్చింది” అని వివరించారు.ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ, “నేను కాంగ్రెస్ వాదిగానే పుట్టాను, కాంగ్రెస్ వాదిగానే మరణిస్తాను” అని ఆయన ఉద్ఘాటించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తనను తాను, తన పరిసరాలను, అలాగే రాజకీయ ప్రత్యర్థులను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. బీజేపీకి సొంత సిద్ధాంతం లేదని, ఆర్ఎస్ఎస్ నుంచి స్వీకరించిన సిద్ధాంతంతోనే ఆ పార్టీ నడుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. కష్టపడి పనిచేస్తే అధికారం తనంతట అదే వస్తుందని, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.