హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈనెల 19న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. లాక్డౌన్ను మే 3వరకు యథావిధిగా కొనసాగించాలా? వద్దా?. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏప్రిల్ 20 తర్వాత కొన్ని సడలింపులు ఇవ్వడమా? అనే అంశాలపై మంత్రివర్గం కీలకంగా చర్చించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వమిచ్చిన మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 20 వరకు యథావిధిగా లాక్డౌన్ అమలవుతుందని, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో వెల్లడించారు. ఈనేపథ్యంలో ఈనెల 19న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రజలు ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. మరో వైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 650కి చేరింది. బాధితుల్లో ఇప్పటి వరకూ మొత్తం 118 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లారు. ఇవాళో మరో 128 మంది డిశ్ఛార్జి కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వేర్వేరు ఆసుపత్రుల్లో 514 మంది వైరస్తో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో 22 జిల్లాల్లో 259 కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.