తిరువనంత పురం: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం కన్నూర్ కు పశ్చిమ నైరుతి దిశగా 360 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. వచ్చే 12 గంటల్లో తీవ్ర వాయు గుండంగా మారి మరింత బలపడనుంది. ఈ నెల 16న తుపానుగా మారు తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుగా మారితే దీన్ని ‘తౌక్టే’ అని పిలుస్తారు. ‘తౌక్టే’ తీవ్ర తుపానుగా, అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది, గుజరాత్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో లక్షద్వీప్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, కొంకణ్-గోవా, గుజరాత్, నైరుతి రాజస్థాన్ లో వర్షాలు కురుస్తాయి. తుపాను తీరాన్ని సమీపించే కొద్దీ బలమైన గాలులు, కుంభవృష్టి తప్పదు. తౌక్టే ప్రభావం ఏపీలో పాక్షికంగా ఉంటుంది. రాయలసీమలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. జూన్ 1న నైరుతి రుతుపవనాలు ఆగమనానికి ఈ తుపాను మార్గం సుగమం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.