
హైదరాబాద్..తెలంగాణలో కాంగ్రెస్ టికెట్టుపై గెలుపొందిన ఎమ్మెల్యేలు తెరాసకు ఫిరాయించడంపై టీపీసీసీ గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేసింది. కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ నాయకత్వంలో శనివారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ను కాంగ్రెస్ నాయకులు కలుసుకున్నారు. కాంగ్రెస్ను వీడుతున్నట్లు ప్రకటించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ను కోరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేసేలా శాసన సభ స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అంతకు ముందు గాంధీ భవన్లో మాట్లాడిన మొయిలీ పార్టీ ఫిరాయింపులు బ్లడ్ కేన్సర్ లాంటిదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్న ఈ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా పోరాటం చేస్తామని తెలిపారు.