కేన్సర్ మహమ్మారిని తొలి దశలోనే గుర్తిస్తే రోగి జీవిత కాలాన్ని
పొడిగిస్తూ పోవచ్చని వైద్యులు తరచూ సలహా ఇస్తుంటారు. అయితే మన దేశంలో కేన్సర్ చివరి
దశ వరకు చాలా మంది వైద్యుల వద్దకు వెళ్లడం లేదు. దీని వల్ల చికిత్సలు ఫలించడం లేదు.
దీంతో కేన్సర్ వస్తే ఇక మరణమేనని భావించే పరిస్థితి నెలకొంది. కొన్ని జాగ్రత్తలతో
కేన్సర్ను తొలి దశలోనే గుర్తించవచ్చు. అవేమంటే…
ఆహారం మింగేటప్పుడు నొప్పిగా ఉన్నా లేదా అజీర్ణ సమస్యలు ఏర్పడినా
కడుపులో లేదా గొంతు కేన్సర్గా అనుమానించవచ్చు. ఈ లక్షణాలుంటే సకాలంలో వైద్యుని సంప్రదించాలి.
తరచూ మూత్ర
విసర్జనకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్త వహించాలి. పెద్ద పేగు కేన్సర్ తొలి దశ లక్షణాలు
ఇలాగే ఉంటాయి. మూత్రంలో రక్తం వచ్చినా లేదా
మూత్ర విసర్జన సమయంలో నొప్పి అనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించాలి. ప్రొస్టేట్
కేన్సర్ తొలి లక్షణాలూ ఇలాగే ఉంటాయి.
దగ్గుతున్నప్పుడు
నోటి నుంచి రక్తం వచ్చినా, మర్మాంగాల నుంచి రక్తం కారుతున్నా వైద్యులను సంప్రదించాలి.
త్వరగా అలసిపోయినట్లు,
నిత్యం అలసట అనిపించినా పెద్ద పేగు కేన్సర్, లుకేమియాలకు సంకేతమేమో అని ఒకసారి పరీక్షలు
చేయించుకుంటే మంచిది.
ఉన్నట్లుండి
బరువు తగ్గడం మంచి లక్షణం కాదు. కొన్ని కేన్సర్ల వల్ల బరువు క్రమేణా తగ్గుతుంది.
అకారణంగా ఒకే
చోట నొప్పి అనిపించినా, మందులు తీసుకున్నాక కూడా నొప్పి తగ్గకపోయినా కేన్సర్గా అనుమానించవచ్చు.
పెద్ద పేగు కేన్సర్, మెదడులో కణితి, అండాశయ, పురీష నాళం కేన్సర్లకు ఈ లక్షణాలు సంకేతాలుగా
భావించవచ్చు.
శరీరంలో ఎక్కడైనా
వాపు కనిపించినా, గడ్డలు ఏర్పడినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలవాలి.
నిత్యం జ్వరం వస్తుంటే, ఎన్ని మందులు వాడినా తగ్గకపోయినట్లయితే లుకేమియా, లింఫోమా వంటి రక్త కేన్సర్లకు సంకేతమేమో పరీక్షలు చేయించుకోవాలి.
చర్మం ఎర్రబడినా, చిన్న మచ్చలు, పులిపిర్లు వంటివి వదలకుండా
పీడిస్తున్నా వైద్యులను సంప్రదించాలి.
దగ్గు వచ్చినప్పుడు
ఛాతీ, భుజాల వద్ద నొప్పులు వస్తున్నట్లయితే వైద్యులను కలవాలి.