సిమ్లా: హరియాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఎన్ఎల్డీ, బీఎస్పీల మధ్య పొత్తు ఖరారైంది. ఇరు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో కలిసి పోరాడతాయని రెండు పార్టీలు గురువారం ప్రకటించాయి. పదేండ్లుగా హరియాణను లూటీ చేస్తున్న బీజేపీని అధికారం నుంచి సాగనంపాలని, కాంగ్రెస్ను అధికారానికి దూరంగా ఉంచాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని ఐఎన్ఎల్డీ నేత అభయ్ సింగ్ చౌతాలా పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను వ్యతిరేకిస్తున్న ప్రజలంతా తమ కూటమికి మద్దతుగా నిలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ఓ ఫ్రంట్గా ఏర్పడి ప్రజల విశ్వాసం చూరగొంటామని చెప్పారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో సంకీర్ణ సర్కార్ ఏర్పాటవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీతో పొత్తు వివరాలను చౌతాలా ప్రకటించారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దీపీందీర్ సింగ్ హుడా బీజేపీ ఏజెంట్ అని ఆరోపించారు. తాను కాషాయ పార్టీ ఏజెంట్నని ఆయన తన పనుల ద్వారా నిరూపించుకున్నారని చౌతాలా ఎద్దేవా చేశారు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయని, ప్రజలకు ఇచ్చే హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఈ సందర్భంగా చౌతాలా భరోసా ఇచ్చారు.