న్యూ ఢిల్లీ : జియో, ఎయిర్ టెల్ వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ టారిఫ్లను పెంచుతూ, కనీస రీఛార్జ్ ప్లాన్ల ధరలను సవరిస్తున్న ప్రస్తుత తరుణంలో, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తన వినియోగ దారులకు ఒక శుభవార్త అందించింది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని అత్యంత చవకైన రీఛార్జ్ ప్లాన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ. 147కే నెల రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ను ప్రవేశ పెట్టింది. ఈ ప్లాన్ వివరాల్లోకి వెళ్తే, రూ. 147 తో రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు 30 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ నెల రోజుల పాటు దేశంలోని ఏ నెట్వర్క్కైనా అపరిమితంగా వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు 10 జీబీ హై-స్పీడ్ డేటాను కూడా అందిస్తున్నారు. రోజుకు సుమారు ఐదు రూపాయల ఖర్చుతో వినియోగదారులు ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్లో ఒక పరిమితి ఉంది. కేటాయించిన 10 జీబీ డేటా వినియోగం పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 40 కేబీపీఎస్కు తగ్గిపోతుంది. అందువల్ల, అధికంగా ఇంటర్నెట్ వాడే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోకపోవచ్చు. కానీ, ప్రధానంగా వాయిస్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ, పరిమితంగా డేటా వాడే వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్గా నిలుస్తుంది. పెరుగుతున్న రీఛార్జ్ ధరల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ ప్లాన్ బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.