మహబూబ్నగర్: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ఆదివారం పాలమూరుకు ప్రధాని ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. పాలమూరుకు లక్ష లేదా 50 వేల కోట్ల ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీ గతంలో ఏ వేదిక మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా హామీ ఇచ్చి మరిచారో అదే వేదిక మీదకు ఏం ఉద్దరిద్దామని వస్తున్నారని నిలదీశారు. తెలంగాణ డబ్బులతో ప్రాజెక్టులు కట్టుకుంటాము కాని కృష్ణానదిలో నీటివాట తేల్చాలన్నారు. తెలంగాణను అవమానించిన మోడీకి ఇక్కడేమి పని అని ప్రశ్నించారు. మోడీ పాలమూరుకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. అడ్డదారుల్లో తెలంగాణలో పాగావేయాలని బీజేపీ చూస్తోందని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను బీజేపీ నాశనం చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు.