కరోనా కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది.వ్యాపారాలు,రవాణా ఇలా అన్ని రంగాలు పూర్తిగా నిలిచిపోగా పెళ్లిల్లు సైతం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.కొంతమంది మాత్రం ఆగలేక కుటుంబ సభ్యులు,బంధువులు,స్నేహితుల మధ్య వివాహాలు చేసుకున్నా 95 శాతం మంది వివాహాలు వాయిదా వేసుకున్నారు.లాక్డౌన్ కారణంగా రెండుసార్లు పెళ్లి వాయిదా పడడంతో మూడోసారి కూడా వాయిదా పడుతుందేమోన్న భయంతో ఓ యువతి కాలినడకన పెళ్లికొడుకు ఇంటికి చేరుకొని మరీ వివాహం చేసుకుంది.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్షణ్ తిలక్ గ్రామానికి చెందిన గోల్డీ అనే యువతికి భైసాపూర్ గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ తో పెళ్లి నిశ్చయమైంది. వీరి పెళ్లిని ఏప్రిల్ లో జరిపించాలని నిశ్చయించిన పెద్దలు, ఆపై లాక్ డౌన్ కారణంగా మే నెల 4వ తేదీకి వాయిదా వేశారు.మేలో కూడా వివాహం జరిగే వీలు కుదరకపోవడంతో మరో మంచి ముహూర్తం చూద్దామని పెద్దలు భావించారు. అయితే, తనకు వెంటనే పెళ్లి చేయాలని, ఇక శుభ ముహూర్తాల కోసం వేచి చూడవద్దని వధువు తన తల్లిదండ్రులతో వాదించగా, వారు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె, ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయలుదేరి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరుడి గ్రామానికి చేరింది. తమ కుమార్తె కనిపించడం లేదని గోల్డీ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న సమయంలోనే, ఆమె కాబోయే అత్తగారింటికి చేరిందన్న సమాచారం అందింది. ఆపై పెళ్లిని అందరి సమక్షంలో ఘనంగా జరిపిస్తామని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో, సాదాసీదాగా పెళ్లి తంతును కానిచ్చేశారు. నడిచి వచ్చిన వధువుతో వీరేంద్ర కుమార్ వివాహం జరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఎస్పీ అమరేందర్ సింగ్ వెల్లడించారు.