అహ్మదాబాద్: మిడతల దండు గుజరాత్ పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు 11 కేంద్ర ప్రభు త్వం బృందాలు వచ్చాయి. మిడతలు దండు బనాస్కాంఠా, మెహసాణా, కచ్, పాఠన్, సాబర్కాంఠా జిల్లాల్లో ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళ దుంప, గోధుమ, పత్తి, జట్రోఫా పంటల్ని నాశనం చేస్తున్నాయి. బనాస్కాంఠా జిల్లాలోనే ఐదు వేల హెక్టార్లలో పంటకు నష్టం కలిగింది. డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం, పొలాల్లో టైర్లను కాల్చటం, డప్పుల్ని మోగించడం, పొలాల వద్ద టేబుల్ ఫ్యాన్లు పెట్టడం, లౌడ్ స్పీకర్లతో సంగీతాన్ని వినిపించడం ద్వారా ఆ కీటకాలను చెదర గొట్టాలని రైతులకు సూచించారు. వీటి వల్ల పెద్దగా ఫలితం లేదు. బనాస్కాంఠా జిల్లాలో 1815 హెక్టార్లలో క్రిమి సంహారక మందు లను చల్లారు. ఇప్పటివరకూ 25 శాతం మిడతలను నిర్మూలించారు. మరో 4 రోజుల్లో పూర్తిగా వాటి బెడదను తొలగిస్తామని అధికారులు తెలిపారు. దాదాపు దశాబ్దకాలం తర్వాత మిడతల దండు ఈ ప్రాంతంపై దాడి చేసింది. ఇవి ఆఫ్రికాలోని సూడాన్, ఎరిట్రియా దేశాల నుంచి బయలుదేరాయి. సౌదీ అరేబియా, ఇరాన్ ద్వారా పాకిస్థాన్లోకి ప్రవేశించాయి. అక్కడి సింధ్ రాష్ట్రంలోని ఎడారి ప్రాంతం గుండా భారత్కు వచ్చాయి. వీటికి ఎక్కువ దూరం ఎగిరే సత్తా ఉంది. ఒక్కో దండు విస్తృతి ఏకంగా 30-35 చదరపు కిలోమీటర్ల మేర ఉంటోంది. గుజరాత్లో ఈసారి నైరుతి రుతుపవనాలు ఎక్కువ కాలం కొనసాగడంతో ఈ మిడతలు అక్కడే తిష్టవేశాయి. రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలోనూ అవి ఉన్నాయి. మిడతల రాకపై ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) హెచ్చరికలు చేసినప్పటికీ స్థానిక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని నిపు ణులు పేర్కొన్నారు.