ముంబయి:వినాయక నిమజ్జనానికి ముందు ముంబయిలో మానవ బాంబులు ప్రవేశించారంటూ బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు నోయిడాకు చెందిన అశ్వినికుమార్ సుప్రాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఆరు మెమరీ కార్డ్ హోల్డర్లు, రెండు డిజిటల్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ మెయిల్స్ ఎందుకు చేశాడనే కారణాలు తెలియాల్సి ఉంది.ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూముకు గురువారం బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. మహా నగరంలో 14మంది ఉగ్రవాదులు చొరబడ్డారని, 34వాహనాల్లో మానవ బాంబులు వేర్వేరు ప్రాంతాల్లో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నట్లు చెప్పారు. 400కిలోల ఆర్డీఎక్స్తో పేలుళ్లు జరపనున్నట్లు బెదిరింపు మెయిల్ సారాంశమన్నారు. ఆర్డీఎక్స్తో కోటి మందిని చంపుతామని దుండగులు మెసేజ్లో బెదిరించినట్లు చెప్పారు. ఇప్పుడు మేం చేపడుతున్న భారీ పేలుళ్లు మొత్తం ముంబయి నగరాన్ని కుదిపేస్తాయని మెయిల్లో పేర్కొన్నట్లు తెలిపారు. లష్కర్ ఏ జిహాదీ అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు వెల్లడించారు. తాను పాక్కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడిగా మెయిల్ పంపిన వ్యక్తి పేర్కొన్నట్లు చెప్పారు. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అశ్వినికుమార్ను ముంబయి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.