చండీఘడ్:ఇండియా, పాకిస్థాన్ మధ్య గత 10 రోజులుగా కాల్పుల విరమరణ అమలు ఉండటంతో సరిహద్దు భద్రతా దళాలు పాకిస్థాన్ సరిహద్దుల్లో అత్తారి-వాఘా, హుస్సేనివాలా, ఫజిల్కా బీటింగ్ రిట్రీట్ సెర్మనీలను మంగళవారం స్వల్ప స్థాయిలో నిర్వహించనున్నాయి. బీటింగ్ రిట్రీట్ సమయంలో పాకిస్థానీ వైపు ఉన్న గేట్లను తెరవబోమని, పాక్ సిబ్బందితో కరచాలనం ఉండదన్నారు. కానీ బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశాన్ని ప్రజలకు కల్పించారు. సాయంత్రం 5.30 నిమిషాలకు భారీ సంఖ్యలో సద్కీ బోర్డర్కు చేరుకోవాలని స్థానికులకు సరిహద్దు ప్రాంత సంస్థ పిలుపు నిచ్చింది. అత్తారి వద్ద 1959 నుంచి బీటింగ్ రిట్రీట్ను నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రెండు దేశాల జాతీయ పతాకాలను అవనతనం చేస్తారు. సాధారణంగా దీపావళి, ఈద్, గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవ రోజుల్లో మఠాయిలు పంచుకుంటారు. అమృత్సర్కు 30 కిలోమీటర్ల దూరంలో, లాహోర్కు 22 కిలోమీటర్ల దూరంలో అత్తారి-వాఘా బోర్డర్ ఉన్నది. ఇక్కడ బీటింగ్ రిట్రీట్ సెర్మనీ వీక్షించేందుకు 25 వేల మంది సామర్థ్యం కలిగిన గ్యాలరీ ఉన్నది.