‘బన్ని’ రక్తం ఆగేనా?

‘బన్ని’ రక్తం ఆగేనా?

కర్నూలు: దేవరగట్టు బన్ని ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలూరు మలె మల్లేశ్వరుల విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రెండు జట్లుగా విడిపోయి రక్తం కారేలా కర్రలతో కొట్టుకోవటం తెలిసిదే.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచీ జనం దీనికి హాజరవుతారు. అవాంఛ నీయ ఘటనలు జరుగకుండా, రక్తం చిందకుండా ఉత్సవాల నిర్వహణకు పోలీసులు ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించ లేదు. ప్రజలు తమ సంప్రదాయంలో భాగమైన కర్రల సమరాన్ని మాత్రం వదలడం లేదు. ఎప్పటిలాగే ఈ సంవత్సరమూ కర్రల సమరానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా భారీ స్థాయిలో దేవరగట్టులో మొహరించారు. విగ్రహాల ఊరేగింపు జరిగే వీధుల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఇనుప చువ్వలు గుచ్చే కర్రలను వాడ వద్దని గత 10 రోజులుగా గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇనుప చువ్వలు వాడినట్టు తెలిస్తే, క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. బన్ని ఉత్సవం కర్రలను అధికారులు పరిశీలించారు. ఉత్సవంలో గాయపడిన వారికి వెంటనే చికిత్సను అందించేందుకు ప్రత్యేక వైద్య బృందాలను, అంబులెన్స్ లను సిద్ధం చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ప్రశాంతంగా బన్ని ఉత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos