వెల్లింగ్టన్ : క్రైస్ట్చర్చ్లో జరిగిన దారుణ మారణ హోమం కారణంగా బంగ్లాదేశ్ క్రికెటర్లు కివీస్ పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరుగు పయనమయ్యారు. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి ఇరు జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్టు రద్దయింది. రెండు మసీదుల్లో ఆగంతకులు తెగబడడంతో 49 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లా క్రికెటర్లు శనివారం స్వదేశానికి బయలుదేరారు. క్రైస్ట్చర్చ్ విమానాశ్రయం నుంచి వారు ఢాకా బయల్దేరిన ఫొటోలను బంగ్లాదేశ్ క్రికెట్ తన అధికారికి ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. విమానాశ్రయంలో వారున్నంత సేపు కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. కాల్పులు జరిగిన మసీదు వద్దకు బంగ్లా క్రికెటర్లు శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చారు. ఆ లోపలే దారుణం జరిగిపోయింది. ఓ మూడు, నాలుగు నిముషాలు ముందుగా వచ్చి ఉంటే క్రికెటర్లకు ప్రమాదం జరిగి ఉండేది.