15 నుంచి విమాన టికెట్ల బుకింగ్‌లు

15 నుంచి విమాన టికెట్ల బుకింగ్‌లు

ముంబై : కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో సేవలను నిలుపుదల చేసిన విమానయాన సంస్థలు మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 15 నుంచి బుకింగులు స్వీకరణ ప్రారంభిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. విమానాల బుకింగులు స్వీకరిస్తామని, డీజీసీఏ కొత్తగా మార్గదర్శకాలు ఏవైనా జారీ చేస్తే వాటిని అనుసరిస్తామని తాజాగా ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఆసియా వెల్లడించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏప్రిల్ వరకు అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సేవలను నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 తర్వాత ఎప్పుడైనా బుకింగ్స్ స్వీకరించొచ్చని పౌర విమానయాన సంస్థ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా గురువారం తెలిపారు. దీంతో ఏప్రిల్ 15 నుంచి ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఆసియా భారత ప్రతినిధి తెలిపారు. ఇండిగో, స్పైస్‌జెట్‌, గో ఎయిర్ దేశీయ సర్వీసులకు ఏప్రిల్ 15 నుంచి బుకింగ్స్ స్వీకరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. విస్తారా సైతం బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. స్పైస్‌జెట్‌, గో ఎయిర్ సంస్థలు మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించిన బుకింగ్స్‌ను కూడా ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మాత్రం ఏప్రిల్ 30 వరకు బుకింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌కు సంబంధించిన తదుపరి నిర్ణయం వెలువడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos