గౌహతి : రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీ, ఆరెస్సెస్ కలిసి కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. శివసాగర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ప్రధాని మోదీ, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ‘రాష్ట్రాన్ని విభజించడం వల్ల ప్రధాని మోదీకి కానీ, ముఖ్యమంత్రి శర్బానంద్ సోనోవాల్కు కానీ ఏమీ నష్టం జరగదు. కానీ రాష్ట్ర ప్రజలకు, దేశంలోని మిగతా ప్రాంతాలకు తీరని హాని జరుగుతుంద’న్నారు. సీఏఏ అక్షరాలను కొట్టివేసినట్టున్న కండువాను ధరించి ప్రసంగించారు. ‘ఈ దేశం మీకెంత అవసరమో, దేశానికీ మీరు అంతే అవసరం. ప్రపంచంలోని ఏ శక్తీ రాష్ట్రాన్ని విభజించజాలదు. అసోం ఒప్పందం జోలికి రావాలని చూసే వారికి కాంగ్రెస్ పార్టీ , రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు కానీయబోము. రూ.167 లు ప్రజలకు చూపించి, తేయాకు కార్మికులకు రోజు వారీ దక్కుతున్నది ఇంతే. గుజరాతీ వ్యాపారవేత్తలు మాత్రం తేయాకు తోటలనే దక్కించుకుంటున్నారు. మేము అధికారంలోకి వస్తే తేయాకు కార్మికులకు రోజుకు రూ. 367 అందిస్తామ’ని హామీ ఇచ్చారు.