హైదరాబాదు: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. 11 గంటలకు సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ వ్యవహారల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళిక శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సబ్కమిటీ సమర్పించనుంది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ కూడా తమ నివేదికను ఉపసంఘానికి అందించింది. ఈ రెండు నివేదికలపై క్యాబినెట్ చర్చించి ఆమోదించనుంది. అనంతరం వీటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు.