న్యూఢిల్లీ : అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకే శిక్షలు వేయ రాదని వివిధ రంగాలకు చెందిని 49 మంది ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం రాసిన లేఖలో హితవు పలికారు. దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీల పై అప్రతిహతంగా సాగుతున్న హింసాత్మక ఘటనల్ని ఖండించారు. సినీ మేధావులు అదూర్ గోపాలకృష్ణ, మణిరత్నం, అనురాగ్ కశ్యప్లు, అపర్ణ సేన్, కొంకణా సేన్ శర్మల, చరిత్ర కారులు రామచంద్ర గుహ, సామాజిక వేత్తలు డాక్టర్ బినాయక్ సేన్, ఆశిష్ నంది తో పాటు మొత్తం 49 మంది ప్రముఖులు ఈ లేఖలో సంతకాల్ని చేసారు. ‘అధిక వర్గాలకు జై శ్రీరాం పవిత్రమైనది. దానిని అపవిత్రం చేయడం మనేయండి. దళితులు, క్రైస్తవులు, ముస్లింలపై జరుగుతున్న అమానుష ఘటనలను, ఊచకోతలను వెంటనే అరికట్టాలి. 2016లో ఇలాంటి ఘటనలు దాదాపు 840 కేసులు నమోదయిన విషయాన్ని నేర గణాంక సంస్థ(ఎన్సీఆర్బీ) ద్వారా తెలిసి అశ్చర్యపోయాము. జై శ్రీరాం నినాదం ఇప్పుడు దేశంలో హింసాత్మకంగా మారింది. ఈ దీన స్థితికి మేము చింతిస్తు న్నామ’ని ఆక్రోశించారు.‘దళితులు, ముస్లింల జరుగుతున్న ఊచకోతపై మీరు పార్లమెంటులో స్పందించిన విషయం తెలుసు .కానీ వాటిని ఆపడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాల’ని కోరారు. ‘అసమ్మతి లేని ప్రజాస్వామ్యం ఉండదు. అలాగని ప్రజలను దేశ వ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్గా ముద్ర వేయకూడదు. అసమ్మతిని కారణంగా చూపి ప్రజలకే శిక్షలు వేయకూడద’ని హితవు పలికారు.