గుంటూరు : విద్యుత్ ఒప్పందాల్లో తప్పులు జరగడానికి కారకుడైన పారిశ్రామికవేత్త అదానిపై చర్య తీసుకునే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. గుంటూరులోని తన కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఒప్పందాల్లో జగన్ లడ్డూలాగా దొరికాడని, అయినా తాను కక్షసాధింపు చర్యలకు వెళ్లడంలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఒప్పందం వెనుక అసలు సూత్రదారి అదాని ఉండటం వల్ల ఆయనపై చర్య తీసుకోలేక జగన్పై నెపం మోపుతున్నారని ఎద్దేవా చేశారు. సెకీ ఒప్పందంలో జగన్ పాత్ర ఏమీ లేదని తెలిసే చంద్రబాబు మౌనంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఆరు నెలల కాలంలో కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. వైసిపికి చెందిన అనేక మందిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. రెడ్బుక్లో పేర్లు రాసుకుని వారిని అరెస్టు చేయడమే తప్ప సాధించింది శూన్యమని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేకపోయారని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నానిపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిమాండ్ చేశారు.