న్యూ ఢిల్లీ : గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఒక ఆపరేషన్లో ‘ ఆల్ఖైదా ఇన్ ఇండియన్ సబ్కాంటినెంట్’ (ఏక్యూఐఎస్) తో సంబంధాలున్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. నకిలీ నోట్ల రాకెట్ నడుపుతూ, ఆల్ఖైదా భావజాలాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేస్తున్న మొహద్ ఫైక్, మొహద్ ఫర్దీన్, సైఫుల్లా ఖురేషి, జీషన్ అలీని అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరిని గుజరాత్ బయట మరో రాష్ట్రంలో అరెస్టు చేసినట్టు సమాచారం.
ఆటో-డిలీట్ యాప్లతో రహస్య కమ్యూనికేషన్
ఈ ఉగ్రవాదులు తమ కమ్యూనికేషన్ను రహస్యంగా ఉంచేందుకు ఆటో డిలీట్ యాప్లను ఉపయోగించారని ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఈ యాప్లు వారి సందేశాలను ఎటువంటి ఆధారాలు లేకుండా తొలగించేలా రూపొందించారు. సోషల్ మీడియా వేదికల ద్వారా అల్ఖైదా భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, యువతను జిహాదీ కార్యకలాపాల వైపు ఆకర్షించేందుకు వీరు ప్రయత్నించారు.