హైదరాబాద్: ప్రముఖ తెలుగు హాస్య నటుల్లో ఒకరైన అలీ సోమవారం ఉదయం వైకా;పాలో చేరారు. వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అర్థగంట పాటు ఇద్దరి మధ్య మంతనాలు సాగాయి. ఆ తర్వాత అలికి జగన్ మోహన రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి గల అవకాశాల గురించి జగన్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో అలీ వైకాపలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘స్నేహం వేరు, రాజకీయం వేరు. పవన్ కల్యాణ్ నాకు మంచి మిత్రుడు. ఆయన సక్సెస్ అయితే నేను సక్సెస్ అయినట్లు భావిస్తాను. నాకు అన్ని పార్టీలు, అందరూ తెలిసినవారే. కానీ జగన్ రావాలి, జగన్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం కూడా అందుకు చేయూతనిద్దామని వైసీపీలో చేరాను’’ అని మాధ్యమ ప్రతినిధులతో అన్నారు. ‘పాద యాత్ర చేసి నపుడు జగన్ చాలా మందికి హామీ ఇచ్చినందున తనకు టికెట్ దక్కే అవకాశం లేదు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ తరఫున ప్రచారం చేసి జగన్ను సీఎం చేస్తాన’ని స్పష్టీకరించారు. గుంటూరు తూర్పు నుంచి తెదేపా అభ్యర్థిగా అలీ పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. దీని గురించి తెదేపా నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో తాను పార్టీ మారినట్లు అలీ వెల్లడించారు. జగన్ మాట ఇస్తే తప్పరన్నారు. వైకాపా గెలుపు కోసం కృషి చేయాలని జగన్ కోరారని చెప్పారు. రాజమండ్రి లేక విజయవాడ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని చెప్పానన్నారు. గతంలో జగన్, చంద్రబాబు , పవన్ కల్యాణ్తో అలీ వరుసగా భేటీ అయ్యారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన తెదేపాలో చేరుతారని, గుంటూరు పశ్చిమ లేక రాజమండ్రి విధానసభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అలీ వెంట మరో నటుడు కృష్ణుడు ఉన్నారు. అలీతో పాటు మంత్రి దేవి నేని ఉమా సోదరుడు చంద్రశేఖర్ కూడా వైకాపాలో చేరారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అనేక కారణాల వల్ల పార్టీ మారాల్సి వచ్చిందన్నారు. అధికార పార్టీ దోపిడీ మితి మీరిందని, పట్టిసీమ వంటి సాగు నీటి పథకాల్లో దోపిడీ విపరీతంగా రిగిందని చంద్రశేఖర్ ఆరోపించారు.ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైఎస్సార్ సీపీలోకి ప్రముఖుల చేరికలు ఊపందుకున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కొందరు సినీ నటులు కూడా పార్టీలో చేరారు.