న్యూఢిల్లీ : పైలట్లకు విశ్రాంతి, అంతర్జాతీయ విమానాల్లో సిబ్బంది నియామకాల్లో 29 ఉల్లంఘనలపై ఎయిర్ ఇండియాకు డిజిసిఎ నాలుగు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఎయిర్ఇండియాకు 14 రోజుల సమయం ఇచ్చింది. ఈ నోటీసుల విషయంపై ఎయిర్ ఇండియా గురువారం ఒక ప్రకటనలో స్పందించింది. ‘గత ఏడాది కాలంలో ఉల్లంఘనలపై డిజిసిఎ నుంచి నోటీసులను అందుకున్నాం. గడువులోగా ఈ నోటీసులకు ప్రతిస్పందిస్తాం. మా సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు కట్టుబడి ఉన్నాం’ అని ప్రకటనలో ఎయిర్ ఇండియా తెలిపింది. పైలట్లకు శిక్షణ, సమయపాలన విషయంలో 19 ఉల్లంఘనలు గుర్తించినట్లు డిజిసిఎ తెలిపింది. 2024 జులై నుంచి 2025 జూన్ వరకూ ఇవి జరిగినట్లు తెలిపింది. 2024 జూన్ నుంచి 2025 జూన్ మధ్య ఒక ఫస్ట్ ఆఫీసర్, ఇద్దరు కెప్టెన్లకు వారపు విశ్రాంతి విషయంలో మూడు ఉల్లంఘనలు జరిగినట్లు తెలిపింది.