న్యూ ఢిల్లీ: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం తీవ్ర కలకలం రేగింది. ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన ఓ బెదిరింపుతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విస్తృత తనిఖీలు చేపట్టగా, అది బూటకపు బెదిరింపని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద ఉన్న ఎయిర్ ఇండియా విమానంలోని క్యాబిన్లో సిబ్బందికి ఓ టిష్యూ పేపర్ లభించింది. దానిపై “ఎయిర్ ఇండియా 2948 @ T3లో బాంబు ఉంది” అని రాసి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించి, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీతో పాటు విమానంలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. గంటల తరబడి సాగిన ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ లభించలేదు. దీంతో ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, టిష్యూ పేపర్పై సందేశం రాసిందెవరనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో విమానాలకు, విమానాశ్రయాలకు ఇలాంటి బెదిరింపులు ఎక్కువ కావడం ఆందోళన కలిగిస్తోంది.