ఇప్పటికే నిర్మాతల మండలికి సంబంధించి కేసులతో సతమతమవుతున్న నడిగర్ సంఘం అధ్యక్షుడు,తమిళ హీరో విశాల్కు తాజాగా చెన్నై నగరంలోని ఎగ్మూర్ కోర్టు షాకిచ్చింది. చట్ట ప్రకారం ఆదాయపన్ను శాఖకు చెల్లించాల్సిన రూ.4కోట్ల సేవా పన్నులనుచెల్లించాలని లేదంటే విచారణకు సిద్ధం కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పేరుతో సంస్థను నడుపుతున్న విశాల్ పలు చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.అయితే సంస్థ లావాదేవీలకు సంబంధించి కొంతమందికి డబ్బులు చెల్లించిన విశాల్ అందుకు సంబంధించి టీడీఎస్ కట్టలేదు. ఇలా విశాల్ రూ.4 కోట్ల మేర టీడీఎస్ ఆదాయపన్నుశాఖకు బాకీ పడడంతో టీడీఎస్ చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసినప్పటికీ విశాల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీంతో ఐటి అధికారులు కోర్టును ఆశ్రయించగా. విచారణకు హాజరుకావాలని గతంలో చాలా సార్లు న్యాయస్థానం సమన్లు జారీ చేయగా విశాల్ స్పందించలేదు. చివరికి నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేయడంతో విశాల్ బుధవారం ఎగ్మూర్ కోర్టులో హాజరయ్యారు. దాదాపు రెండు గంటల కోర్టు విచారణలో పాల్గొన్న విశాల్ కు న్యాయస్థానం ఒక వివరణ ఇచ్చింది. ‘కేసును కొనసాగించాలనుకుంటున్నారా? లేక ఆదాయపు పన్ను శాఖకు కట్టాల్సిన రూ.4కోట్లు ఇచ్చి కేసుకు ముగింపు పలుకుతారా?’ అని కౌంటర్ ఇచ్చింది. వచ్చే నెల 12న కోర్టుకు సరైన వివరణ ఇవ్వాలని న్యాయమూర్తి, విశాల్ కు తెలియజేశారు..