అహ్మదాబాద్:ప్రధాని మోదీకి సొంత గడ్డలో గట్టి షాక్ తగిలింది. విసవదార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై ఆప్ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నెల 19న జరిగిన లూథియానా (పంజాబ్), కాళీగంజ్ (పశ్చిమబెంగాల్), కాడి, విసవదార్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టారు. ఇందులో విసవదార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గోపాల్ ఇటాలియా ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కిరీట్ పటేల్పై 17 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గోపాల్ ఇటాలియాకు 75,000 కంటే ఎక్కువ ఓట్లు రాగా, కిరీట్ పటేల్కు 58,000 కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాగా, గత ఎన్నికల్లో విసవదార్ నుంచి గెలుపొందిన ఆప్ ఎమ్మెల్యే భయానీ భూపేంద్రభాయ్ తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో గతవారం ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ స్థానాన్ని మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీనే కైవసం చేసుకుంది.