న్యూ ఢిల్లీ: తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. జూన్ 6న సత్యేంద్ర జైన్, జూన్ 9 న సిసోదియా విచారణకు రావాలని పేర్కొంది. 12 వేల తరగతి గదులు, తాత్కాలిక నిర్మాణాల్లో 2 వేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని కేసు నమోదు చేసింది.ఆప్ ప్రభుత్వంలో సిసోదియా విద్యాశాఖ, ఆర్థికశాఖల మంత్రిగా పనిచేశారు. సత్యేంద్ర జైన్ ప్రజా పనుల విభాగం ఇంఛార్జ్గా, ఇతర శాఖల మంత్రిగా పనిచేశారు. తరగతి గదుల నిర్మాణంలో అనేక తప్పులు దొర్లాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చేసిన సాంకేతిక అధ్యయనంలో తేలింది. తరగతి గదుల నిర్మాణంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఆప్ నాయకులు మనీష్ సిసోదియా, సత్యేంద్ర జైన్లకు ఏసీబీ నోటీసులు జారీచేయటాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. బీజేపీ తమ నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి ఒక సాధనంగా ఏసీబీని ఉపయోగిస్తుందని ఆరోపించింది. తరగతి గదుల నిర్మాణంలో ఎటువంటి అవినీతి జరగలేదని తెలిపింది. ఏసీబీ ఇచ్చినవి రాజకీయ సమన్లని విమర్శించింది. “ఇది పెద్ద కుట్ర. బీజేపీ రాజకీయ కుట్ర. ఆప్ నాయకులపై దాడి చేయడానికి, తప్పుడు కథనాలను సృష్టించడానికి దర్యాప్తు సంస్థలను ఆయుధంగా ఉపయోగిస్తుంది బీజేపీ. ఆ ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదు. ఇది స్వచ్ఛమైన రాజకీయం. అప్పుడు ఆప్ అధికారంలో ఉన్నప్పుడు ఏసీబీకి అధికారాలు లేవని చెప్పిన బీజేపీ, ఇప్పుడు తమ నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి వినియోగిస్తుంది” అని ఆరోపించింది.