న్యూఢిల్లీ: మరో మూడు నెలల్లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచ
కప్పునకు భారత జట్టు తుది కూర్పుపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది. ఈ టోర్నీకి ముందు భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ద్వైపాక్షికి సిరీస్ ఆడనుంది. ఈ
తరుణంలో ఇదే తన భారత జట్టు అంటూ దిగ్గజ ఆటగాడు గవాస్కర్ ప్రకటించాడు. అందులో దినేశ్ కార్తీక్కు ఓపెనర్గా అవకాశం కల్పించాడు. దినేశ్ కార్తీక్ను మూడో ఓపెనర్గా ఎంపిక చేసిన
గవాస్కర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రహానేలకు మాత్రం తన జట్టులో చోటివ్వలేదు. ఇంగ్లండ్ విమానం ఎక్కబోయే భారత జట్టులో వీరు కచ్చితంగా ఉంటారన్నాడు. అందులో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్యా,
భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చహల్, బుమ్రా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్లకు చోటు కల్పించాడు. ఇక 14 ఆటగాడిగా విజయ్ శంకర్ ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్లో వాతావరణ పరిస్థితుల్ని బట్టి ఇద్దరు ఆల్ రౌండర్లు ఉండాలనుకుంటే అప్పుడు విజయ్ శంకర్కు అవకాశం ఇస్తారన్నాడు. అయితే 15వ ఆటగాడిగా ఎవరు వరల్డ్కప్ జాబితాలో ఉంటారో అనే దానిపై కచ్చితంగా చెప్పలేనన్నాడు. ఖలీల్ అహ్మద్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో
మరో పేసర్గా ఉమేశ్ యాదవ్ ఒక మంచి ఆప్షన్గా పేర్కొన్నాడు.