న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఇచ్చే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాడు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు.
పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కోహ్లి తన ఫౌండేషన్ ద్వారా ఏటా అవార్డులు అందజేస్తారు. ఆర్పీ-ఎస్జీ గ్రూప్ భాగస్వామ్యంతో ఈ అవార్డులను అందజేస్తారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ కార్యక్రమం శనివారం జరగాల్సి ఉంది. అయితే పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్ల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ‘ఆర్పీ-ఎస్జీ ఇండియన్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం వాయిదా పడింది. పుల్వామా ఉగ్రదాడిలో భారత్ వైపు తీవ్ర నష్టం జరిగిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం’ అని కోహ్లి ట్వీట్ చేశాడు. పుల్వామా ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.