న్యూఢిల్లీ : ఉగ్రవాద
నిరోధక చర్యల విషయంలో చైనా మరోసారి భారత్కు మొండిచేయి చూపింది. జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో గురువారం జరిగిన
ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనను ఖండించిన చైనా ఈ దాడికి
బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినాయకుడు మసూద్ అజర్ను
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. చైనా
విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షుయాంగ్ ఉగ్రవాదుల దాడి గురించి శుక్రవారం ఇక్కడ ప్రతిస్పందించారు. “పుల్వామాలో ఉగ్రవాద దాడి తీవ్ర
దిగ్భ్రాంతికి గురి చేసింది. దాడిలో అమరులు, క్షతగాత్రులైన జవాన్లకు మా ప్రగాఢ
సానుభూతి.. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా నిర్ద్వంద్వంగా ఖండిస్తాం.. ఉగ్రవాద ముప్పును
తిప్పికొట్టి ప్రాంతీయ శాంతి, సుస్థిరత నెలకొల్పేందుకు ఇరుగుపొరుగు దేశాలు
సహకరించుకోగలవని” ఆశించారు.”పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ను ఐరాస భద్రతా
మండలి కౌంటర్-టెర్రరిజం జాబితాలో ఉంచారని, వ్యక్తిగతంగా మసూద్ అజర్ను
అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనే అంశాన్ని బాధ్యతాయుతంగా, వృత్తిపరమైన నిబంధనలకు
అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని” ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి అతడిపై నిషేధం విధించాలని భారత్
పలుమార్లు చేసిన ప్రతిపాదనను భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా
తిరస్కరిస్తూ వస్తోంది. ఈ విషయంలో భారత్కు అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు
మద్దతు పలికాయి. మసూద్ ఉగ్రవాది అనేందుకు సరైన కారణాలు చూపించడం లేదన్న చైనా భారత్
ప్రతిపాదనలను తిరస్కరిస్తోంది.