ముంబయి: దేశీయ
స్టాక్మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో
దేశీయంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో వరుసగా మూడో రోజు కూడా
కీలక సూచీలు నష్టాల బాటపట్టాయి. ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 115
పాయింట్లకుపైగా నష్టపోయి 35,760 వద్ద.. నిఫ్టీ 39 పాయింట్లు నష్టపోయి 10,706 వద్ద
కొనసాగుతున్నాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 71.23 వద్ద
ట్రేడవుతోంది. ఐటీ తప్ప అన్ని రంగాలూ నష్టాల్లోనే. ముఖ్యంగా ఫార్మా, మెటల్,
ఆటో, బ్యాంకింగ్ సెక్టార్లు నష్టపోతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా,
జీ, హీరో మోటో, టాటా మోటార్స్, హెచ్పీసీఎల్, వేదాంతా, టైటన్, ఇన్ఫ్రాటెల్,
సిప్లా టాప్ లూజర్స్గా ఉండగా, ఓఎన్జీసీ, పవర్గ్రిడ్, బీపీసీఎల్, ఎన్టీపీసీ,
ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, గెయిల్, ఐటీసీ లాభపడుతున్నాయి. రూపాయి కూడా బలహీనంగానే
ఉంది. డాలరు, చమురు ధరల నేపథ్యంలో దేశీయ కరెన్సీ నష్టాల్లో ఉంది.
డాలరు మారకంలో నిన్నటి ముగింపు 71.16తో పోలిస్తే, శుక్రవారం 71.23వద్ద
ట్రేడింగ్ను ఆరంభించింది.
‘స్థిరీకరణ దిశలో రూపాయి.
ముంబై: డాలర్
మారకంలో రూపాయి విలువ 69.50 – 72 శ్రేణిలో స్థిరీకరణ జరుగుతున్నట్లు కనపడుతోంది.
ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ గురువారం 36 పైసలు నష్టపోయి,
71.16 వద్ద ముగిసింది. గురువారం 70.90 వద్ద ప్రారంభమైన రూపాయి, ఒకదశలో 71.18
స్థాయికి పడింది. బుధవారం రూపాయి ముగింపు 70.80. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల
పటిష్టత, ప్రధాన కరెన్సీలపై డాలర్ బలపేత ధోరణి, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి
వెనక్కు వెళుతున్న నిధులు రూపాయి బలహీనతకు తక్షణ కారణం.అక్టోబర్ 9వ తేదీన రూపాయి
చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్ ధరలు అంతర్జాతీయంగా
ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన
నేపథ్యంలో…రూపాయి క్రమంగా కోలుకుని 69.40 స్థాయిని చూసింది. అయితే మళ్లీ
క్రూడ్ ధర తాజా కనిష్ట స్థాయిల నుంచి పెరగడంతో రూపాయి జారుడుబల్లమీదకు ఎక్కింది.
ఈక్విటీ మార్కెట్ల నష్టాలూ ఇందుకు తోడవుతున్నాయి. ఆయా పరిస్థితుల్లో రూపాయి
ప్రస్తుతం స్థిరీకరణ బాటలో ఉందని భావిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్
క్యాపిటల్ మార్కెట్స్ స్ట్రేటజీ హెడ్ వీకే శర్మ విశ్లేషించారు.