ట్రంప్‌ తీరుతో కలిగిన బాధను, అవమానాన్ని మర్చిపోలేం

ట్రంప్‌ తీరుతో కలిగిన బాధను, అవమానాన్ని మర్చిపోలేం

న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ తో సంబంధాలపై సానుకూలంగా మాట్లాడటం, ప్రధాని మోదీ  వెంటనే స్పందించడంపై కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ కామెంట్స్‌ చేశారు. ప్రధాని మోదీ త్వరగానే స్పందించినప్పటికీ రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలే ఉన్నాయని అన్నారు. భారత్‌ విషయంలో ట్రంప్‌ తన స్వరాన్ని తగ్గించడాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నామని థరూర్‌ చెప్పారు. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుంటే ట్రంప్‌ వల్ల కలిగిన బాధను, అవమానాన్ని త్వరగా మర్చిపోలేమని అన్నారు. అధ్యక్షుడు, ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయని తెలిపారు. ట్రంప్‌ పాదరస స్వభావం కలిగిన వ్యక్తని థరూర్‌ అభివర్ణించారు.‘ప్రధాని నరేంద్రమోదీ చాలా త్వరగా స్పందించారు. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం. రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నా. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది’ అని థరూర్ మాట్లాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos