టెహరాన్:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పట్ల గౌరవంగా.. మర్యాదగా మాట్లాడాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి హెచ్చరించారు. అణు ఒప్పందం కుదరాలంటే నిజాయితీగా ఉండాలని.. అగౌరవంగా మాట్లాడకూడదని తెలిపారు. లేదంటే ఖమేనీ అభిమానులు, మద్దతుదారులు బాధపడతారని తెలిపారు. ఇరానీయన్లు.. బెదిరింపులు, అవమానాలకు లొంగిపోరని తేల్చి చెప్పారు. అమెరికాతో అణు చర్చలను తిరిగి ప్రారంభించేదిలేదని స్పష్టం చేశారు.ఇటీవల ట్రంప్ మాట్లాడుతూ.. ఖమేనీని చంపకుండా రక్షించామని, కానీ ఆయనకు కృతజ్ఞత లేదంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఖమేనీ ఎక్కడ ఆశ్రయం పొందారో తమకు తెలుసని.. అమెరికా, ఇజ్రాయెల్ దళాల చేతుల్లో చావకుండా కాపాడామని.. అతి ఘోరమైన చావు నుంచి తానే కాపాడినట్లు పేర్కొన్నారు.. అయినా ఖమేనీ తనకు ధన్యవాదాలు తెలపలేదని ట్రంప్ రాసుకొచ్చారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.