గువహటి : అస్సాంలో సిఆర్పిఎఫ్ శిబిరంపై జరిగిన గ్రెనేడ్ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడినట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. గోలాఘాట్ జిల్లాలోని బోకాఖాట్ సమీపంలో సిఆర్పిఎఫ్ శిబిరంపై మంగళవారం రాత్రి మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు గ్రెనేడ్తో దాడి చేశారు. గాయపడిన వారిని బోకాఖాట్లోని ఆస్పత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారని, విచారణ చేపట్టారని అన్నారు. మోటార్ సైకిల్పై వచ్చిన నిందితుల కోసం గాలిస్తున్నామని, ఉగ్రవాద చర్య లేదా దుండగుల చర్య తో పాటు పలు కోణాల్లో విచారణ చేపడుతున్నామని చెప్పారు.రాష్ట్ర వ్యవసాయమంత్రి అతుల్బోరా ఈ ఘటనను ఖండించారు. ‘పిరికిపంద హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. నాగరిక సమాజంలో ఇటువంటి ఘటనలకు చోటు లేదు’ అని పేర్కొన్నారు. ఆయన బోకాఖాట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.