న్యూ ఢిల్లీ: అహ్మదాబాద్ విమానాశ్రయం కార్యకలాపాల్ని నిలిపివేసినట్లు విమానాశ్రయ ప్రతినిధి వెల్లడించారు. తదుపరి ప్రకటన వెలువడే వరకూ ఈ చర్యలు అమల్లో ఉంటాయన్నారు. గురువారం మధ్యాహ్నం ఇక్కడి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోవటం దీనికి కారణం. ప్రమాదం సంభవించినపుడు విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది.