చెన్నై: గతేడాది అన్నా యూనివర్సిటీ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన జ్ఞానశేఖరన్ కు మహిళా కోర్టు న్యాయమూర్తి రాజలక్ష్మి సోమవారం 30 ఏళ్ల జైలు శిక్ష, రూ.90,000 జరిమానా విధించారు. గత వారం ఈ కేసును విచారించిన కోర్టు జ్ఞానశేఖరన్ను దోషిగా తేల్చింది. చార్జిషీట్లో పేర్కొన్న మొత్తం 11 అభియోగాల్లో అతడు దోషిగా తేలాడు. తాను వృద్ధురాలైన తన తల్లితోపాటు, ఎనిమిదేళ్ల కుమార్తె బాగోగులు చూసుకోవాల్సి ఉందని, కాబట్టి తనకు తక్కువ శిక్ష విధించాలని నేరగాడు అభ్యర్థించాడు. యూనివర్సిటీ పరిసరాల్లో బిర్యానీ పాయింట్ నడుపుతున్న జ్ఞానశేఖరన్ గత ఏడాది డిసెంబర్లో 19 ఏళ్ల విద్యార్థినిపై క్యాంపస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. వర్సిటీలో సెకండియర్ చదువుతున్న విద్యార్థినిపై గతేడాది డిసెంబర్ 23న ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి క్యాంపస్ వెనుకవైపు ఏకాంతంగా ఉన్న సమయంలో నిందితుడు అక్కడికి వెళ్లి వారిని వీడియో తీశాడు. బాధితురాలి స్నేహితుడిని బెదిరించి వెళ్లగొట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను తన మొబైల్లో రికార్డు చేశాడు. విషయం బయటకుచెబితే వీడియో బయటపెడుతానని బ్లాక్మెయిల్ చేశాడు. అయినా బాధితురాలు భయపడకుండా తన స్నేహితుడితో కలిసి ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపింది. ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనపై విచారణ జరిపి చార్జిషీట్ దాఖలు చేశారు. జ్ఞానశేఖరన్పై మొత్తం 11 అభియోగాలు మోపారు. అన్ని అభియోగాల్లోనూ అతడిని దోషిగా తేల్చిన మహిళా కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది.